ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 10 September 2026, 3:25 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

శంకర్ పల్లి మండలం చందిప్పలో అర్ధరాత్రి దారుణం:వృద్ధురాలిపై కత్తులతో దాడి!

శంకర్ పల్లి మండలం చందిప్పలో అర్ధరాత్రి దారుణం:
వృద్ధురాలిపై కత్తులతో దాడి!

రంగారెడ్డి. అర్జున్ సమాచారం ప్రతినిధి సెప్టెంబర్ 10.

 శంకర్ పల్లి మండలం చందిప్ప గ్రామంలో బుధవారం అర్ధరాత్రి ఘోర కలకలం రేగింది.ఒంటరిగా ఉన్న ఓ 80 ఏళ్ల వృద్ధురాలిపై దుండగులు కత్తులతో దాడికి తెగబడ్డారు.చోరీ ప్రయత్నంలో భాగంగానే ఈ దాడి జరిగినట్లు స్థానికంగా తీవ్ర భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.గ్రామస్తులు మరియు పోలీసుల కథనం ప్రకారం.. చందిప్ప గ్రామానికి చెందిన చాకలి రుక్కమ్మ (80) అనే వృద్ధురాలు బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత (సుమారు12:10గంటల ప్రాంతంలో) మూత్ర విసర్జన కోసం ఇంటి బయటకు వచ్చారు.ఆ సమయంలో ఇంటి పక్కన ఎవరో నక్కి ఉన్నట్లు గమనించిన ఆమె,అనుమానంతో గట్టిగా కేకలు వేశారు.దీంతో తీవ్ర ఆందోళనకు గురైన దుండగులు, తమ వెంట తెచ్చుకున్న కత్తులతో వృద్ధురాలిపై ఒక్కసారిగా దాడి చేసి అక్కడి నుంచి చీకట్లోకి పరారయ్యారు.ఆమె పెట్టిన ఆర్తనాదాలు విన్న చుట్టుపక్కల ప్రజలు వెంటనే సంఘటనా స్థలానికి పరుగులు తీశారు.రక్తపు మడుగులో ఉన్న వృద్ధురాలిని చూసి షాక్‌కు గురైన స్థానికులు,వెంటనే శంకర్ పల్లి పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందిన వెంటనే శంకర్ పల్లి పోలీసులు  ఘటనా స్థలానికి చేరుకున్నారు.పరిస్థితిని సమీక్షించి, బాధితురాలి నుంచి వివరాలు సేకరించారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.ప్రాథమిక సమాచారం ప్రకారం నలుగురు నిందితులు ఈ దారుణానికి ఒడిగట్టినట్లు గుర్తించామని,వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు ముమ్మరం చేశామని స్పష్టం చేశారు.త్వరలోనే నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షిస్తామని భరోసా ఇచ్చారు.
ఈ ఘటన నేపథ్యంలో శంకర్ పల్లి పోలీసులు గ్రామస్తులకు పలు కీలక సూచనలు చేశారు:
రాత్రి వేళల్లో ప్రజలంతా అత్యంత అప్రమత్తంగా ఉండాలి. తాళాలు వేసి ఉన్న ఇళ్లపై, నిర్మానుష్య ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఉంచాలి. గ్రామాల్లో కొత్త వ్యక్తులు లేదా అనుమానాస్పదంగా సంచరించే వారు కనిపిస్తే వెంటనే డయల్ 100కు గానీ, లేదా స్థానిక శంకర్ పల్లి పోలీస్ స్టేషన్‌కు గానీ సమాచారం అందించాలి.ఈ ఘాతుకంతో చందిప్ప గ్రామ ప్రజలు తీవ్ర భయాందోళనల్లో మునిగిపోయారు.గ్రామంలో రాత్రి వేళల్లో పోలీస్ పెట్రోలింగ్‌ను మరింత పెంచాలని స్థానికులు కోరుతున్నారు.